సీఏఏ వ్యతిరేక హింసను అదుపు చేసేందుకు ఆర్మీని పిలవమని చెప్పండి: సుబ్రహ్మణ్యస్వామి

  • అమిత్ షాకు రాజ్ నాథ్ అవగాహన కలిగించాలన్న బీజేపీ సీనియర్ నేత
  • సైన్యం వస్తేనే హింస ఆగుతుందని వెల్లడి
  • సీఏఏ వ్యతిరేక నిరసనలను జాతి వ్యతిరేక చర్యలతో పోల్చిన వైనం
ఎన్డీయే ప్రభుత్వం సీఏఏ తీసుకురావడం పట్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట హింస ప్రజ్వరిల్లుతోంది. దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. సీఏఏ వ్యతిరేక హింసను అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలవాలని, ఈ దిశగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సలహా ఇవ్వాలని సూచించారు.

 ఇలాంటి అల్లర్ల అణచివేతకు సైన్యాన్ని రంగంలోకి దింపడం ప్రజాస్వామ్య సంప్రదాయపరంగా తీవ్ర చర్యే అయినా, హింసను రూపుమాపి ముఖ్యంగా ప్రజాస్వామ్యం కొనసాగేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. సీఏఏ వ్యతిరేక నిరసనలు అంటే జాతి వ్యతిరేక చర్యలేనని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు.

Subramanian Swamy
CAA
Rajnath
Amit Shah
Army
India

More Telugu News